
పంద్రాగస్టుకు పోదువు.. లే కొడుకా
తిమ్మాపూర్: ఉదయం అందరితో కలిసి సంతోషంగా బడికి వెళ్లాడు. తెల్లవారితే పంద్రాగస్టు కావడంతో ఆ వేడుకల గురించే తోటి పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంటికి ఆటోలో బయల్దేరాడు. కానీ, ఆ బాలుడి ఆనందం మార్గంమధ్యలోనే ఆవిరైంది. ఆటో ప్రమాదం అనంతలోకాలకు తీసుకెళ్లింది. ‘పంద్రాగస్టుకు పోదువు లే.. కొడుకా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. తిమ్మాపూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులతో స్కూల్ నుంచి ఆటో మన్నెంపల్లికి బయల్దేరింది. గ్రామానికి 500మీటర్ల దూరంలో కుక్కలు ఆటో వెంట పరుగెత్తడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. 15మంది చిన్నారుల్లో నలుగురుకి తీవ్ర గాయాలు, మిగిలినవారికి స్వల్ప గాయాలయ్యాయి. మన్నెంపల్లికి చెందిన 4వ తరగతి విద్యార్థి నాంపల్లి హర్షవర్ధన్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో ఎడమవైపు కూర్చున్న హర్షవర్ధన్న్పై ఆటో బరువుపడడంతోపాటు, పగిలిన ఆటో అద్దాలు అతని తలలో గుచ్చుకున్నాయి. అతని ఎడమ చేయి కూడా తీవ్రంగా దెబ్బతిని నుజ్జునుజ్జుగా మారింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, గాయాల తీవ్రతతో హర్షవర్ధన్ మృతి చెందాడు. అదే ఆటోలో హర్షవర్ధన్ అక్క నాంపల్లి శ్రీసాహితి కూడా ఉంది. తమ్ముడు కళ్లముందే తీవ్రంగా గాయపడడం చూసి బోరున విలపించింది. హర్షవర్ధన్ తల్లిదండ్రులు నాంపల్లి శ్రీనివాస్, సమతలు వ్యవసాయం చేస్తూ, కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఈ దుర్ఘటన వారి కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచెత్తింది. శ్రీనివాస్ ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
పాఠశాలకు వెళ్లొస్తుండగా అదుపుతప్పిన ఆటో
నాలుగేళ్ల బాలుడి దుర్మరణం.. నలుగురికి తీవ్రగాయాలు
రెండు నిమిషాల్లో ఇంటికి చేరే క్రమంలో ప్రమాదం
కరీంనగర్ జిల్లా మన్నెంపల్లి శివారులో ఘటన

పంద్రాగస్టుకు పోదువు.. లే కొడుకా