
నిర్మల్ టు కోరుట్ల
● గంజాయి తరలిస్తున్న ముఠా
● బ్రేక్ వేసిన జగిత్యాల పోలీసులు
● అరకిలో గంజాయి పట్టివేత
● ఆరుగురు రిమాండ్
● మూడు బైక్లు, ఐదు సెల్ఫోన్లు సీజ్
కోరుట్ల: పాఠశాలల పరిసరాల్లో గంజాయి అమ్ముతూ.. విద్యార్థులను వ్యసనపరులుగా మారుస్తున్న గంజాయి ముఠాసభ్యులు ఆరుగురిని కోరుట్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. సీఐ సురేశ్ బాబు కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన ఎండీ.అమేర్ఖాన్, ఎండీ. ముష్, సోహైల్, హురెరా, కోరుట్లకు చెందిన షేక్ మజీద్, ఎండీ.ఉమేర్ పట్టణ శివారులో అడ్డా వేసి గంజాయి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఎస్సైలు చిరంజీవి, రాంచంద్రం అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేపట్టగా నిర్మల్ పరిసర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి కోరుట్ల, జగిత్యాల పరిసరాల్లో అమ్ముతున్నట్లు వెల్లడించారు. కొంత కాలంగా వీరు గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి అర కిలో గంజాయి, మూడు బైక్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు ఎస్సైలు, కానిస్టేబుళ్లు పురుషోత్తం, శ్రీనివాస్, రాజేశ్వర్రావును ఎస్పీ అభినందించారు.
ధరూర్లో గంజాయి విక్రేత అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల ధరూర్ క్యాంప్లో కోదండరామాలయం వద్ద గంజాయి విక్రయించేందుకు వస్తున్న ఎల్లేశ్వరం ఫణీంద్రను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 105 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై కుమారస్వామి రామాలయం వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఫణీంద్ర గంజాయి విక్రయించేందుకు వస్తున్నాడు. అనుమానంతో ఆయనను తనిఖీ చేయగా అతని వద్ద 105 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.