● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్లాస్టిక్ రహిత గ్రామంగా
‘గొట్టిముక్కుల’ ప్రకటన
దోమకొండ: ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఇందుకోసం సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు మండలంలోని గొట్టిముక్కులలో జీపీ పాలకవర్గం చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించి, అభినందించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించారు. కమ్యూనిటీల వారీగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు కొనుగోలు చేసి, వివిధ శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో వాటిని వినియోగించేలా చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రామపంచాయతీకి అందజేసే వారికి ప్రోత్సాహకంగా స్టీల్ వాటర్ బాటిళ్లను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. గ్రామంలోని ఆరు మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.కోటి రుణాలు మంజూరు కాగా.. ఆయా సంఘాల ప్రతినిధులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్, అదనపు కలెక్టర్ గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో మధురిమ, తహసీల్దార్ స్వప్న, ఏవో మణిదీపిక, కెనరా బ్యాంక్ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య మందిరం తనిఖీ..
ముత్యంపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డీఎంహెచ్వో వెంకట్, సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ దేవేందర్గౌడ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


