● నకిలీ నోట్లు స్వాధీనం
● ఇతర రాష్ట్రాల్లో సంబంధాలపై
కొనసాగుతున్న విచారణ
బాన్సువాడ రూరల్:నకిలీ కరెన్సీ కొనుగోలు చేసి చె లామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును బా న్సువాడ పోలీసులు రట్టు చేశారు. శుక్రవారం బాన్సువాడలో డీఎస్పీ విఠల్రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పర్బని జిల్లాకు చెందిన రావుసాహెబ్ అనే యువకుడు తనకు పరిచయమైన ఓవ్యక్తి ద్వారా హైదరాబాద్లోని ముదస్సర్ హుస్సేన్ అలియాస్ షాబాబా వద్ద నకిలీ కరెన్సీ దొరుకుతుందని తెలుసుకున్నాడు. తన మిత్రులు ప్రతీక్, భీమ్ శంకర్ రామ్లతో కలిసి వెళ్లి షాబాబా వద్ద రూ.లక్ష అసలు కరెన్సీ ఇచ్చి రూ.2 లక్షల నకిలీ కరెన్సీ తీసుకున్నారు. ఈ నెల 26 న స్వస్థలానికి వెళ్తూ పిట్లం హైవే సమీపంలోని పెట్రోల్ బంకులో రూ.2 వేల పెట్రోల్ పోయించుకొని రూ.500 నకిలీ నోట్లు నాలుగు ఇచ్చారు. అవి నకిలీ నోట్లుగా బంక్ క్యాషియర్ గుర్తించి కారును ఆపే ప్రయత్నం చేయగా ఆపకుండా వెళ్లిపోయారు. దీంతో క్యాషియర్ శ్రీకాంత్రెడ్డి ఈ నెల 27న పిట్లం పీఎస్లో ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, మిగిలిన నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేయడానికి ముగ్గురు నిందితులు కారులో హైదరాబాద్ బయలుదేరగా ధర్మారం టోల్ప్లాజా వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.500 విలువైన 182 నకిలీ నోట్లు, మొత్తం రూ.91 వేలు, నేరానికి ఉపయోగించిన మూడు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కేసులో నకిలీ కరెన్సీ సరఫరా చేసిన ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని సంబంధాలపై కూడా విచారణ జరుగుతోందన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పిట్లం ఎస్సై ఆంజనేయులు, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, పోలీస్ సిబ్బంది శైలేశ్, రాము, వెంకటేశ్లను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు.


