● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 80 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈవో చందర్, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వచ్చేవారం నుంచి అన్ని
మండలాల్లో ప్రజావాణి ..
ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్, మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ అనంతరం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి ఫిర్యాదులను మండల, డివిజన్ స్థాయిలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మండలాల్లో తమకు అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక పరిస్థితులు, అవసరం ఉన్న సందర్భాల్లో మాత్రమే జిల్లా కేంద్రానికి వచ్చి వినతులు సమర్పించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.


