ప్రచార హోరు
బిచ్కుందలో..
● ఇంటింటికి వెళ్తున్న అభ్యర్థులు
● కార్నర్ మీటింగ్లలో ముఖ్యనేతలు
మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం ఓటర్లు, వివిధ సంఘాల నాయకులతో ఫోన్లలో మాట్లాడడం, సమావేశాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల ఎన్నికల్లో తమతమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఆయా బల్దియాలపై తమ పార్టీ జెండా ఎగురవేయడం కోసం వ్యూహరచన చేస్తున్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల్లో ర్యాలీలు నిర్వహిస్తూ కార్నర్ మీటింగులలో మాట్లాడుతున్నారు. ప్రత్యర్థులను ఎండగడుతూనే, తమ అభ్యర్థులను గెలిపిస్తే ఏం చేస్తామో వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వార్డులలో ఆయన పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో పలు వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ తమ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగిస్తున్నారు. అవినీతి రహిత పాలన కోసం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
బిచ్కుందలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బిచ్కుందను మున్సిపాలిటీగా చేసిన ఘనత తమదేనని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్కు ఓటేయాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆయా వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. తన హయాంలో బిచ్కుంద అభివృద్ధికి నిధులు తీసుకువచ్చానని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు ప్రచారం చేస్తున్నారు.


