‘మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేద్దాం’
బాన్సువాడ : మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కో ఇన్చార్జి అశోక్ పర్ణమి పిలుపునిచ్చారు. గురువారం ఆయన బాన్సువాడలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అవినీతి రహిత పాలన అందిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను, ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. హామీలను అమలు చేయని పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సేవ్ తెలంగాణ.. ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ, బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇంద్రసేనారెడ్డి, నాయకులు కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చీదరి సాయిలు, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలవారీగా పార్టీ కో ఆర్డినేటర్లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీకి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, నేరెళ్ల శారద, ఎల్లారెడ్డి మున్సిపాలిటికీ ఎం.వేణుగౌడ్, బాన్సువాడకు ఎంపీ సురేశ్ షెట్కార్, బిచ్కుందకు పల్లె లక్ష్మణ్రావు గౌడ్ నియమితులయ్యారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘రాజ్యాంగం –75 ఏళ్ల ప్రస్థానం’ అంశంపై ఒక రోజు రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. హైదరాబాద్ సిటీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం, సవాళ్లు, విజయాలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ప్రిన్సిపల్, వర్క్షాప్ కన్వీనర్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, గణేష్, రాములు, శ్రీనివాస్రావు, చంద్రశేఖర్గౌడ్, అధ్యాపకులు శ్రీకాంత్, అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్కు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారు. 3.30 నుంచి 4.30 గంటల వరకు కొనసాగనున్న బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. వేదికపైనుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 4.45 గంటలకు హెలీప్యాడ్కు చేరకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.
భారీ బందోబస్తు
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1,200 మంది పోలీసులు బందోబస్తు విధులలో పాల్గొంటున్నారు. ఏడుగురు ఏసీపీలు, 45 మంది సీఐలు, 48 మంది ఎస్సైల ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేశారు.
● అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ అర్బన్: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితోపాటు అనువైన ప్రదేశాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలన్నారు.
‘మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేద్దాం’


