బల్దియాలో దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
● బీజేపీకి మున్సిపల్ పీఠం
దక్కితేనే అది సాధ్యం
● ఎన్నికల ప్రచారంలో
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే బీజేపీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రజలను కోరారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఆయా వార్డులలో పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌరస్తాల్లో మాట్లాడుతూ గత పాలకులు బల్దియాను అప్పులపాలు చేశారన్నారు. తాను రూ. 30 కోట్లకుపైగా బల్దియాకు ఆదాయం సమకూర్చేలా చేసి అప్పులనుంచి గట్టెక్కించానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక పట్టణంలో అవినీతి, కబ్జాలు, అక్రమాలకు అడ్డుకట్ట వేశానన్నారు. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రం అభివృద్ధి కావాలంటే తప్పకుండా మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలన్నారు. బీజేపీని గెలిపిస్తే రింగ్రోడ్డు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు, విశాలమైన రోడ్లతో రాష్ట్రంలోనే ఆదర్శంగా కామారెడ్డిని తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.


