
వామ్మో బస్సు..
ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద ఇటీవల ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
తాడ్వాయి మండలంలో మహిళ కాలు మీదుగా బస్సు టైర్ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయి ఆస్పత్రిపాలైంది.
బాన్సువాడ మండలం బోర్లం క్యాంపు వద్ద గురువారం బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు పెరుగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఒక్కోసారి బస్సులో వంద మందికి పైగానే ఉంటున్నారు. ప్రయాణికులు ఒకరినొకరు తోసుకోవడంతో ప్రతి రోజూ బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో డ్రైవర్ ఏకాగ్రత దెబ్బతింటోంది. కాలం చెల్లిన బస్సులను నడపడమే ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఒక వైపు, బస్సులో పరిమితికి మించి జనాలు ఎక్కడం, ఆపై పనిగంటలు పెరగడంతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ డిపోలు మాత్రమే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు నడిచే పల్లె వెలుగు బస్సులు చాలా వరకు కాలం చెల్లినవే తిప్పుతున్నారు. కొన్ని బస్సుల స్టీరింగ్ ఊడిరావడం, మరికొన్ని టైర్లు ఊడిపోవడం వంటి ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి బ్రేక్ ఫెయిలై ప్రమాదాలు జరుగుతున్నాయి.
చాలా బస్సుల్లో ప్రయాణికులు ఫుట్బోర్డుపై వేలాడుతూ కనిపిస్తున్నారు. కనీసం కాలుతీసి కాలు పెట్టే పరిస్థితి ఉండదు. దీనికి తోడు సీట్ల గోళ ఎక్కువవుతోంది. ప్రయాణికులు కూర్చునేందుకు కాదుగదా కాలు పెట్టే పరిస్థితి లేక ఒకరినొకరు తోసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయి. అలాగే ఉచిత ప్రయాణం చేసే మహిళల్ని మగవారు చులకన చేసి మాట్లాడడం, దానికి వారు ఎదురు సమాధానం ఇవ్వడం కూడా గొడవలకు దారితీస్తోంది. కిక్కిరిసిన బస్సులో టిక్కెట్లు తీయడం కండక్టర్కు గుర్రంమీద స్వారీ చేసినట్టుగానే ఉంటోంది. డ్రైవర్ పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతోంది. ప్రయాణికులు బానెట్ మీదకి వచ్చి కూర్చుంటున్నారు.
ప్రమాదం జరిగితే
డ్రైవర్నే బాధ్యుడిని చేస్తున్నారు
కాలం చెల్లిన బస్సులు, రెస్ట్ లేకుండా పనిచేయడం మూలంగా జరిగే ప్రమాదాల్లోనూ ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లను బాధ్యులను చేసి తప్పించుకుంటోంది. బస్సులు కండిషన్లో ఉండేలా చూసుకోవాలసిన బాధ్యత యాజమాన్యంపైనే ఉంటుంది. బస్సుల్లో పరిమితికి మంచి ప్రయాణికులను ఎక్కించుకోవడానికి కారణం బస్సుల సంఖ్య తక్కువగా ఉండడమే. అలాగే బస్సుల కాలపరిమితి ఎప్పుడో ముగిసిపోయినా, మరమ్మతులు చేసి తిప్పుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంస్థ యాజమాన్యం తప్పును తమపైకి తోసి తప్పించుకుంటోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరుస ప్రమాదాలతో
బస్సును చూస్తే జడుసుకునే పరిస్థితి
కాలం చెల్లిన ప్రగతి రథాలు
పరిమితికి మించి ప్రయాణికులు
ఒత్తిడిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు
పల్లె వెలుగు బస్సుల్లో కొన్ని కాలం చెల్లినవి ఉంటున్నాయి. దశాబ్దాల కాలంగా లక్షలాది కిలోమీటర్లు తిరిగిన బస్సులను మరమ్మతులు చేస్తూ నడిపిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెరగడం లేదు. ఉన్న బస్సుల్లో కొన్ని మూలకు చేరుతున్నా వాటి స్థానంలో కొత్తవి రావడం లేదు. చాలా వరకు ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులే వస్తున్నాయి. పల్లెవెలుగులు రాకపోవడంతో ఉన్నవాటినే తిప్పుతున్నారు. దీంతో వాటిని నడపడం కూడా డ్రైవర్లకు సవాల్గా మారింది. దీనికితోడు అప్పట్లో 8 గంటల డ్యూటీ చేసి ఇంటికి వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లు ఇప్పుడు 12 గంటలు ఆగకుండా చేయాలి. మరుసటి మళ్లీ డ్యూటీకి వెళ్లి మరో 12 గంటలు చేయాల్సిందే. ఇలా వరుసగా డ్యూటీ చేయడం కారణంగా అలసటకు గురికావడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

వామ్మో బస్సు..

వామ్మో బస్సు..