
పెండింగ్లోనే సీఎంఆర్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం పండించడంలో, ధాన్యం సేకరణలోనూ జిల్లా నంబర్ వన్గా నిలిచింది. అదేవిధంగా సీఎంఆర్ రికవరీని పెండింగ్ పెట్టడంలోనూ మొదటి స్థానంలోనే నిలబెట్టడంపై జిల్లా యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్క సీఎంఆర్ రికవరీ విషయంలో చర్యలకు దిగాలని ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించినా ఫలితం లేదు.
● 2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి రావాల్సిందే రూ.60 కోట్లు. ఇందుకు సంబంధించి గతంలో సమీక్షలో మంత్రి జూపల్లి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్నా రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయడమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ రూపొందించి కేసుల మీద కేసులు పెట్టి తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అడ్వొకేట్ జనరల్తో కలిసి హైదరాబాద్లో సమీక్షకు రావాలని ఆదేశించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకుగాను షకీల్కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రి క్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించాడు. షకీల్ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు బాధితుడు కిషోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే, సీఎంఆర్ సైతం కిషోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రులుగా వచ్చిన జూపల్లి, సీతక్క అధికారిక సమీక్ష సమావేశాల్లో ఆదేశించినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ విషయమై అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా స్పందించలేదు.
కేసులకే పరిమితం
సీఎంఆర్ రికవరీలో ఉన్నతాధికారులే అ ధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో గత మార్చి 30న బాధితుడి పోరాటంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్రాజ్లపై వర్ని పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. 2022–23 సీజన్లో వర్ని మండలంలోని కిషోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు చూపి ఉన్నతాధికారు లే, సదరు రైస్మిల్లు యజమాని సంతకాన్ని సైతం ఫోర్జరీ చేయించారు. ధాన్యం మాత్రం మాజీ ఎమ్మెల్యే షకీల్ మిల్లుకు పంపించి, సీఎంఆర్ను కిషోర్కు చెందిన మిల్లు నుంచి ఇవ్వాలని ఒత్తిడి తేవడం గమనార్హం. దీంతో దిక్కుతోచని బాధితుడు కిషోర్ నెలల తరబడి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు హైకోర్టు ఆదేశాలతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ, తదుపరి విచారణ, చర్యలు తీసుకోవడంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సదరు అధికారులను పోలీసులు ప్రశ్నించకపోవడం విశేషం.
సీరియస్గా తీసుకోని అధికారులు
గతంలో మంత్రి జూపల్లి, ప్రస్తుత మంత్రి సీతక్క ఆదేశించినా ఫలితం శూన్యం
నిజామాబాద్ జిల్లాలో రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్