కాజులూరు: గొల్లపాలెంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన చోరీపై కాకినాడ డీఎస్పీ మహంతి కిశోర్ కుమార్ విచారణ చేపట్టారు. రెండు రోజుల కిందట దొంగలు ఈ బ్యాంకులో ఏటీఎం పగులగొట్టి, అందులోని రూ.4,35,500 నగదు చోరీ చేశారు. దీంతో పాటు ఏటీఎం గదికి ఉన్న కిటికీ గ్రిల్ తొలగించి బ్యాంకు లోపలకు ప్రవేశించి, బ్రాంచి మేనేజర్ మొబైల్ ఫోన్ను, ఒక డిబ్బీని అపహరించుకుపోయారు. ధ్వంసమైన ఏటీఎంను, బ్యాంకును డీఎస్పీ మంగళవారం పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బ్యాంకు చోరీపై కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశామని, సాధ్యమైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని కిశోర్ కుమార్ చెప్పారు. ఆయన వెంట ఎస్సై ఆర్వీఎన్ మూర్తి తదితరులున్నారు.
అమ్మ మీద బెంగతో ఆగిపోయా..
మలికిపురం: ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను అమ్మ మీద బెంగతోనే విరమించుకున్నానని సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన దారపురెడ్డి తరుణ్ కుమార్ చెప్పాడు. మలికిపురం మండలం దిండి – చించినాడ వంతెన వద్ద అతడు సోమవారం ఉదయం మోటార్ సైకిల్ ఉంచి, దానిపై ఒక లేఖ పెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో, తరుణ్ వశిష్ట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అందరూ భావించారు. అతడి కోసం బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం తాగి వంతెన కింద పడుకుని ఉన్న అతడిని మంగళవారం తెల్లవారుజామున 2 గంటల తరువాత గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. తనకు అప్పులున్నాయని తీర్చలేకే ఇలా చేశానని, నదిలో దూకుదామనుకున్న సమయంలో అమ్మ గుర్తుకు వచ్చి, ఆ ప్రయత్నం విరమించుకున్నానని తల్లిదండ్రులు, పోలీసుల సమక్షంలో తరుణ్ చెప్పాడు. పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు.


