● జగ్గంపేట నియోజకవర్గంలో రూ.150 కోట్ల అవినీతి
● దోషులను వెంటనే శిక్షించాలని
రైతు కూలీ సంఘం డిమాండ్
జగ్గంపేట: జిల్లాలో సహకార పరపతి సంఘాలను దోచుకుంటున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో సహకార పరపతి సంఘాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు కూటమి నేతల హస్తం ప్రధానంగా ఉంటోందని, దీనికి వారే బాధ్యత వహించాలని సంఘ ప్రధాన కార్యదర్శి కె.వీరాంజనేయులు డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలోని రాజపూడి, గండేపల్లి, కిర్లంపూడి తదితర సంఘాల్లో నేటి వరకు రూ.150 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అనేక సంఘాల్లో మరిన్ని కోట్లు దోచుకుతిన్నారన్నారు. బాధ్యులు కూటమి నేతలు కావడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో అనేక వనరుల దోపిడీ పెరిగిందన్నారు. ప్రధానంగా పోలవరం కాలువ మట్టి, కొండలు, గుట్టలను వదలకుండా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని, కోట్ల రూపాయలు దోచుకుతింటోందని తెలిపారు. అయినా ఏ ప్రభుత్వ శాఖా స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు డాన్ శ్రీను, కొండేపూడి మంగయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.


