● కొడుకు, కోడలు వెళ్లగొట్టడంపై ఆర్డీఓకు ఫిర్యాదు
● చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న అధికారులు
● ఇంటిలోని సామగ్రి సైతం వేరు చేసి అప్పగింత
పిఠాపురం రూరల్: తమ కొడుకు కోడలు తమను ఇంటి నుంచి వెళ్లగొట్టారని గత జూన్లో ఆర్డీఓకు చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించి చట్ట ప్రకారం తమ ఇంటిలోనే ఒక పోర్షన్ను వారికి కేటాయించి న్యాయం చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కుమారపురానికి చెందిన పెంకే యేసులక్ష్మి, ఆమె భర్త రాంబాబు తమ కుమారుడు పెంకే లోవప్రసాద్, కోడలు పద్మ తమ ఇంటిని ఆక్రమించుకుని బయటికి పంపేశారని జూన్ 15వ తేదీన ఆర్డీవో మల్లిబాబుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఆర్డీఓ, సబ్ డివిజనల్ మేజిస్టేట్ (తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమం ట్రిబ్యునల్) ఉత్తర్వులను అనుసరించి శనివారం పిఠాపురం తహసీల్దార్ పి.గోపాలకృష్ణ, రూరల్ ఎస్సై జాన్ బాషా ఆధ్వర్యంలో యేసులక్ష్మికి చెందిన ఇంటిలోని రెండు పోర్షన్ల (పోర్షన్ కి 4గదులు) డాబా ఇంటిని, అందులోని సామగ్రిని ఆ దంపతులకు, కొడుకు దంపతులకు వేరు చేసి అప్పగించారు. ఆ సమయంలో కొడుకు, కోడలు అక్కడ లేకపోవడంతో వారి సామగ్రి జాబితాను తయారు చేసి అదే పోర్షన్లో ఒక గదిలో వేసి సదరు సామగ్రిని అప్పగించే సమయంలో ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ ద్వారా వీడియో చిత్రీకరించినట్టు తహసీల్దార్ తెలిపారు. వయోవృద్ధులైన తల్లితండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దారు గోపాలకృష్ణ తెలిపారు.


