ఫ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
ఫ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన
ఘటనలోనూ నిందితులు వీరే
దేవరపల్లి: యర్నగూడెం గ్రామ శివారులో 16వ నంబర్ జాతీయ రహదారి సమీపంలోని పాత బ్రాందీ షాపు వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.2 లక్షల విలువైన 21 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం సీఐ బి.నాగేశ్వర్ నాయక్ విలేకర్లకు తెలిపారు. గత నెల 31వ తేదీ ఉదయం కొందరు రెండు మోటారు సైకిళ్లపై రెండు బ్యాగుల్లో గంజాయిని తీసుకువచ్చారనే పక్కా సమాచారంతో ఎస్సై పి.మనోహర్ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 21 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన పెద్దపారుపూడి మండలం కొర్నిపాడుకు చెందిన మోచర్ల హేమంత్ కుమార్, పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీనగర్కట్టకు చెందిన చామనపూడి చరణ్ దాస్ (చరణ్)ను అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వీరిద్దరూ గత నెల 31న ఉదయం యర్నగూడెం సమీపంలో హైవే మొబైల్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై కత్తితో దాడి చేసి పారిపోయిన కేసులో కూడా నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.


