దేవరపల్లి: పంట నియంత్రణ పాటిస్తూ పొగాకు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత రైతులకు సూచించారు. వేలం కేంద్రం పరిధిలోని గోపాలపురం మండలం చెరుకుమిల్లిలో రైతు ఉండవల్లి రమేష్ బ్యారన్ల వద్ద శుక్రవారం నారుమడి నియంత్రణ, యాజమాన్య పద్ధతులు, పంట నియంత్రణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హేమస్మిత మాట్లాడుతూ నారుమడి పెంపకం, తెగు ళ్లు నివారణ, పురుగు మందుల వినియోగం, నారు విక్రయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. బోర్డు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పొందిన రైతులకు మాత్రమే నారు విక్రయించాలని ఆమె సూచించారు. నారుమడి వేసిన రైతులు తప్పనిసరిగా బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వర్కింగ్ క్యాపిటల్ పథకం కింద బ్యారన్కు రూ.50 వేల రుణ సదుపాయం, రైతు సంక్షేమ నిధి, ఎరువుల కోసం దరఖాస్తు చేసే విధానాన్ని వివరించారు. పొగాకు అధిక ఉత్పత్తి కారణంగా పంటను రైతులు మంచి ధరకు అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమకు కేటాయించిన పరిమాణానికి లోబడి పంట సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులు, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.


