నిత్యం సత్యదేవుని నామం మార్మోగే రత్నగిరిపై.. వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామస్మరణ ప్రతిధ్వనించింది. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా.. సత్యదేవుని సన్నిధిలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుని వార్షిక, నిత్య కల్యాణ మండపంతో పాటు 4, 5 నంబర్ల వ్రత మండపాల్లో ఈ వ్రతాలు జరిగాయి. వార్షిక కల్యాణ మండపంలో రెండు, మిగిలిన మూడు మండపాల్లో నాలుగు బ్యాచ్ల చొప్పున మొత్తం 12 బ్యాచ్లలో 12,230 మంది మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. దీంతో, ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి మహిళలతో కిటకిటలాడింది.
– అన్నవరం


