వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేత జిన్నూరి బాబీ
సాక్షి, అమలాపురం: అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సా ర్ ఉద్యాన పరిశోధన స్థానం (హెచ్ఆర్ఎస్) భూమిని ఎంఎస్ఎంఈ పార్కుకు బదలాయించవద్దని, కేవలం పరిశోధనలకే వినియోగించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్టు అమలాపురంలో శుక్రవారం ఆయన మీడియాకు చెప్పారు. 1972లో స్థాపించిన ఈ పరిశోధన స్థానం 5 దశాబ్దాలుగా కొబ్బ రి అభివృద్ధిలో కీలకంగా ఉందన్నారు. హైబ్రీడ్ వంగడా ల మూల్యాంకనం, జెర్మ్ ప్లాజం పరిరక్షణ, చీడపీడల నివారణలో శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. గోదావరి జిల్లాల్లో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందన్నారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు రికార్డుల ప్రకారం ఇక్కడ 24 హెక్టార్లలో (59.3 ఎకరాలు) కొబ్బరి నర్సరీ ఉందని, ఇందులో ఉన్న మదర్ పామ్స్, బ్రీడింగ్ మెటీరియల్, దీర్ఘకాలిక ప్రయోగ తోటలు వెలకట్టలేని వనరులని తెలిపారు. పాత తోటల స్థానంలో అధిక దిగుబడినిచ్చే హైబ్రీడ్ మొక్కలకు డిమాండ్ పెరిగిందని, వీటి కోసం రైతులు ఎక్కువ కాలం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అందువల్ల సామర్థ్యాన్ని తగ్గించడం కాకుండా విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు ముఖ్యమే అయినప్పటికీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్ఆర్ఎస్ భూమిని పూర్తిగా కాపాడాలని, రానున్న 25 నుంచి 50 ఏళ్లకు అవసరమైన భూమిపై శాసీ్త్రయ అంచనా వేయాలని, హైబ్రీడ్ ఉత్పత్తి పెంచి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలని కోరారు. నిర్ణయం తీసుకునే ముందు వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, రైతుల అభిప్రాయం తీసుకోవాలని సీఎంను బాబీ కోరారు.


