డ్రైవర్లకు గాయాలు, ప్రయాణికులు సురక్షితం
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని చొల్లంగి గొడౌన్ల వద్ద బుధవారం ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ డిపో నుంచి అమలాపురం వెలుతున్న నాన్స్టాప్ బస్సు, అమలాపురం నుంచి కాకినాడ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల ముందుభాగాలు నుజ్జయ్యాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లు నక్కా వెంకటరమణ, బాల నాగసత్య ఉమానాగేంద్రలకు గాయాలయ్యాయి. వీరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ బృందం ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.
తాళం వేసి ఉన్న
ఇంటిలో చోరీ
10 గ్రాముల బంగారు రూపులు,
30 గ్రాముల వెండి అపహరణ
అమలాపురం టౌన్: పట్టణంలోని బుచ్చెమ్మ అగ్రహారంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలో చోరీ జరిగింది. అగ్రహారంలో నివసిస్తున్న కాలనాధభట్ల రామచంద్రమూర్తి తనకు ఎవరూ లేకపోవడంతో అతని ఇంటికి పక్కనే నివసిస్తున్న సోదరుడు కాలనాధభట్ల సాయిరామ్ ఇంటిలో ఉంటుంటాడు. కానీ ప్రతి రోజూ తన ఇంటికి నిత్య పూజా విధులకు వెళ్లి పూజ పూర్తయిన తరువాత ఇంటి తలుపులకు తాళం వేసి మళ్లీ సోదరుడి ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లగా తాళం బద్దల కొట్టబడి ఇంటిలోని 10 గ్రాముల బంగారు రూపులు, 30 గ్రామల వెండి పూజా సామగ్రిని దొంగలు దోచుకున్నట్టు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.లక్ష వరకూ ఉంటుందని ఆ సోదరులు తెలిపారు. రామచంద్రమూర్తి సోదరుడు సాయిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.


