కాకినాడ క్రైం: గంజాయి విక్రయం, వినియోగం, తయారీపై సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు జిల్లా పోలీసు శాఖ తరఫున బహుమతి అందిస్తామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో రైజ్ ఎగైనెస్ట్ గంజా పేరుతో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గంజాయి వినియోగం యువత భవితను నాశనం చేస్తుందన్నారు. ఇది కుటుంబంతో పాటు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. 1972, 112, పోలీస్ వాట్సాప్ 94949 33233 ద్వారా గంజాయి సమాచారాన్ని అందించాలని, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.


