గర్భం గుల్లవుతున్నా పట్టించుకోని అధికారులు
తుని రూరల్: డి.పోలవరం గ్రామానికి చెందిన నారప్ప చెరువు గర్భంలో రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు చేస్తుండగా పగలు వీబీజీ రామ్జీ పథకం పనులు చేస్తున్నారు. చెరువు గర్భాన్ని ప్రమాదకరంగా ఇష్టానుసారం తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టుకుపోతున్నా అధికారులు చూసిచూడనట్టు వ్యహరిస్తున్నారని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండ రాత్రి వేళల్లో జేసీబీలతో తవ్వేసి విలువైన మట్టిని తరలించుకుపోతున్నారు. ముంపు నివారణకు అనువుగా పల్లపు భూములు ఎత్తు చేసుకునేందుకు ఎవరైన రైతులు ఇలా చేస్తే అధికారులు ఆగమేఘాలపై వాలిపోతారని, లే అవుట్లకు అనువుగా భూములను ఎత్తు చేసుకునేందుకు ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నట్టు తెలిపారు. వర్షాలు కురవకపోవడం, తాండవ రిజర్వాయర్ నుంచి చెరువుకు సాగునీరు చేరకపోవడంతో అక్రమార్కులకు చెరువు మట్టి బంగారంగా మారిందన్నారు. భవిష్యత్లో వర్షాలు కురిసినా, తాండవ నుంచి నీరు చేరినా చెరువులో బంటాలు (గుంతలు) ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. కాపరులు పశువులు కడిగేందుకు దిగితే ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలు నిలువరించి మెషీన్లను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.


