యానాం: ప్రేమించి, కులాంతర వివాహం చేసుకుని, ఆరేళ్ల కాపురం చేసిన అనంతరం కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. యానాంలో కలకలం రేపిన ఈ ఘటనపై సీఐ డి.సురేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. యానాం పట్టణ పరిధిలో భీమ్ నగర్కు చెందిన పువ్వల రేఖ (25), కనకాలపేటకు చెందిన చెక్కా అప్పారావు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేరుకున్నారు. వీరిలో రేఖ ఎస్సీ సామాజికవర్గానికి, అప్పారావు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు. పెళ్లయిన అనంతరం దంపతులిద్దరూ కనకాలపేటలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రేఖను అప్పారావు దారుణంగా హింసించి, చాతీపై కూర్చుని ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. మృతదేహాన్ని ఆటోలో తీసుకుని వెళ్లి మెట్టకూరు శివారు గణపతి నగర్ బైపాస్ కాలువలో పడేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పారావుపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా కొంతసేపటికి నిజాన్ని అంగీకరించాడు. దీంతో కాలువలో పడేసిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి, పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


