● పండగ వేళల్లో అవకాశం కల్పించాలి
● ఉమ్మడి జిల్లా బాణసంచా
తయారీదారుల డిమాండ్
● పెద్దాపురంలో సర్వసభ్య సమావేశం
సామర్లకోట: బాణసంచా తయారీదారులపై అధికారులు కరణ చూపాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాణసంచా తయారీదారుల సంఘం డిమాండ్ చేసింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం వేట్లపాలెంలో నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షుడు నామన దుర్గాప్రసాద్, రాజమహేంద్రవరం జిల్లా ఉపాధ్యక్షుడు బాబు బేగ్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాసు, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 మంది బాణసంచా లైసెన్సు తయారీదారులు ఉన్నారన్నారు. తాము కుటీర పరిశ్రమగా నడుపుతున్న బాణసంచా తయారీ కేంద్రాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు 1,500 మంది జీవిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు, రాబోయే పండగల రోజుల్లో బాణసంచా తయారీకి అధికారులు లైసెన్సులు అందించి, జీవనోపాధి కల్పించాలన్నారు. బాణసంచా తయారీని నిలిపి వేయడంతో దానిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తమ ఇబ్బందులపై కలెక్టరు, ప్రజాప్రతినిధులను కలిసినా లైసెన్సులు పునరుద్ధరించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శివకాశీలో మాదిరిగా బాణసంచా తయారీకి ఏపీఐఐసీ భూముల్లో ఓకే చోట స్థలం కేటాయింపునకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, అది తమకు అనువైన నిర్ణయం కాదన్నారు. పెద్ద పరిశ్రమలకు మాత్రమే అటువంటి ప్రణాళికలు ఉపయోగడపడతాయని అభిప్రాయ పడ్డారు. కుటీర పరిశ్రమలకు వ్యక్తిగతంగా స్థలాలు అవసరం ఉంటుందన్నారు. సమావేశంలో నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ సభ్యులు జ్యోతుల శ్రీనివాసు, కార్యదర్శి కింతాడ దుర్గారావు, కోఽశాధికారి గుంటముక్కల శ్రీనివాసు అసోసి యేషన్ నాయకులు పాల్గొన్నారు.


