● యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో సత్యదేవుని ఆలయం దిగువన గల యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ పనులు త్వరగా పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. యంత్రాలయంలో సెంట్రల్ ఏసీ పనులు ఆరు నెలలుగా నత్తనడకన నడుస్తున్న విషయమై శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘నత్త నయం’ శీర్షికన ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించారు. దీనిపై తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీ త్రినాథరావును ఆదేశించారు. దీనిపై పండితులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో ఈఓ సమావేశం నిర్వహించి సెంట్రల్ ఏసీ పనులు రెండ్రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏసీ బ్లోయర్ గొట్టాలు వెలుపలకు తీసుకుని రావడానికి ఆలయ గోడలకు రంధ్రం చేసేందుకు పండితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించినట్టు ఈఓ ‘సాక్షి’కి తెలిపారు.


