● గేదె దూడపై పంజా విసిరిన పులి
● పరిమితడకలో ఘటన
● స్థానికుల భయాందోళన
ఏలేశ్వరం: పులి భయంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్నాళ్లుగా పోలవరం జిల్లా వాసులను భయపెడుతున్న పులి ఇటీవల మండల పరిసరాల్లో సంచరించింది. చివరకు అది మళ్లీ అడవుల్లోకి మళ్లిపోయిందనే సమాచారంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో మండలంలోని పరిమితడక గ్రామంలో ఓ గేదె దూడపై ఆదివారం రాత్రి పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు, తహసీల్దార్ కుశరాజు, ఆర్ఐ ఎస్.పొన్నాలు సందర్శించారు. గాయపడిన దూడను పరిశీలించి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ పులి ప్రస్తుతం పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం పరిసరాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో, రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లోని పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా అటవీ అధికారుల తీరుపై పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి గురించి తాము తీవ్ర భయాందోళనలకు గురవుతూంటే.. అటవీ అధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


