కాకినాడ క్రైం: తాజా నియామక ప్రక్రియలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న 649 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సోమవారం జరిగింది. కాకినాడలోని డీఏఆర్ పోలీస్ మైదానంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో ఏపీఎస్పీ (మెన్), సివిల్ (మెన్, విమెన్) అభ్యర్థులు పాల్గొన్నారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
కరప: పీహెచ్సీల పరిధిలో గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో వైద్యసేవలందించాలని జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సూచించింది. మండలంలోని గురజనాపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా టాస్క్ఫోర్స్ బృందం కె.శ్రీనివాసరావు (స్టాటిస్టికల్ ఆఫీసర్), జి.గిరిగణేష్ (డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్) సందర్శించి, రికార్డులను, ఆర్సీహెచ్, హెచ్ఎమ్ఐఎస్ తదితర పోర్టల్స్ తనిఖీ చేశారు. అనంతరం వారు సిబ్బందితో సమావేశమై గర్భిణులకు, పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకుని, చేయాల్సిన విధులపై సూచనలిచ్చారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, వారికి సరైన వైద్యం అందించి, సుఖప్రసవాలు జరిగేటట్టు చూడాలన్నారు. పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ ఖతీజా సత్తారి అఫ్రోజ్, సీహెచ్ఓ యేసురత్నం, పీహెచ్ఎన్ సత్యనారాయణమ్మ, హెచ్వీ సీత తదితర సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులతో రత్నగిరి కిటకిట
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భోజనం చేశారు. కాగా ముత్యాల కవచాల అలంకరణలో స్వామి, అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు.
సత్యదేవుని భక్తుల కోసం
రెండు హెలికాఫ్టర్ ఫ్యాన్లు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.నాలుగు లక్షలు విలువ చేసే రెండు హెచ్వీఎల్ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను అందజేయనున్నారు. ఏడు మీటర్లు వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తారు. సోమవారం ఆలయానికి వచ్చిన దాత సత్యప్రసాద్ వారం రోజుల్లో వార్షిక కల్యాణ మండపంలో భక్తుల కోసం ఈ ఫ్యాన్లును అమర్చనున్నట్లు అధికారులకు తెలిపారు.
ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి
పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన సోమవారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు, విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్జేడి నాగమణి, డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు ఉన్నారు.
649 మంది ధ్రువపత్రాల పరిశీలన
649 మంది ధ్రువపత్రాల పరిశీలన