
పాదగయ వరలక్ష్మీ వ్రతాల్లో మహిళలకు ఇక్కట్లు
● నిర్వహణలో జనసేన నేతల వైఫల్యం
● సౌకర్యాలు కల్పించని అధికారులు
పిఠాపురం: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో సాగిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు రసాభాసగా ముగిశాయి. వేల మందికి చీరలు సిద్ధం చేసామని జనసేన నేతలు విస్తృత ప్రచారం చేయడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు పాదగయ క్షేత్రంకు చేరుకుని క్యూ లో వేచి చూశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లు పలువురు భక్తులు ఆరోపించారు. విడతల వారీగా పూజలు నిర్వహించడంతో క్యూ లో గంటల తరబడి నిలబడాల్సి రాగా మంచినీరు కూడా అందక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు సైతం పూర్తిగా అందక పోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. కేవలం కొంత మందితో పూజలు పూర్తి చేసి మిగిలిన వారికి చీరలు మాత్రమే ఇస్తామని, పూజలు ముగిసిపోయాయని ఆలయ అధికారులు ప్రకటించడంతో క్యూలో వేచి ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క పూజలకు వచ్చిన మహిళలలో కొంతమందికి చీరలు ఇచ్చి ఇక అయిపోయాయని చెప్పిన జనసేన నేతలు చాటుగా చీరలను బయటకు తరలించే ప్రయత్నం చేయడంతో మహిళలు వాటిని అడ్డుకున్నారు. తమకు పూజ చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆశతో వచ్చామని, పూజలు లేకుండా చేయడంతో పాటు చీరలు కూడా ఇవ్వకుండా పట్టుకెళ్లి పోతారా అంటు జనసేన నేతలపై మండిపడ్డారు. దీంతో జనసేన నేతలకు మహిళలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పూజల్లో పాల్గొన్న మహిళలకు జనసేన నేతలు అన్య మతస్తులతో చీరలు పంపిణీ చేయడంపై భక్తులు మండిపడ్డారు. కనీసం బొట్టు కూడా పెట్టుకోని మహిళా నేతతో హిందువులకు చీరలు ఎలా పంపిణీ చేయించారంటూ జనసేన నేతల తీరును మహిళలు దుయ్యబట్టారు.