గద్వాల: జిల్లాకేంద్రంలోని నల్లకుంటలో దాతల సహకారంతో భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమని, భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఆమె నల్లకుంటలో ఆలయ పునర్నిర్మాణ, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, కలిసికట్టుగా ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సూచించారు.
పెద్దచింతరేవుల అంజన్న సన్నిధిలో..
ధరూరు: మండలంలోని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 48వ చాతుర్మాస మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో నిర్వహిస్తున్న పూజలకు ఆమె హాజరవగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతులు విద్యారాజేశ్వర శ్రీపాదుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, మద్వాచార్యులు, కిష్టాచార్యులు, ధర్మకర్త గిరిరావు తదితరులు పాల్గొన్నారు.
పార్టీని బలోపేతం చేయాలి
గద్వాల: నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎంపీ మల్లురవి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ పరిధిలోని నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగత లోపాలు, కేడర్ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, వంశీచంద్రెడ్డి, రాజీవ్రెడ్డి, సరిత తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండలో
అఖండ పారాయణం
మహబూబ్నగర్ రూరల్: శ్రావణ మాస ఏకాదశిని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం అఖండ విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభమైంది. పూర్వకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా 24 గంటల పాటు నిరంతరంగా పారాయణం నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పారాయణంలో భాగస్వాములవుతున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.


