అలంపూర్ రూరల్: ప్రాంతీయ అభివృద్ధి, మౌళిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అలంపూర్ అభివృద్ధి కమిటీ పోరాటం చేస్తుందని అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం అలంపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలంపూర్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పురోగతి, కరువు మండలంగా ప్రకటించాలని, డిగ్రీ కళాశాల ఏర్పాటు, వచ్చేనెలలో రానున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి జోగుళాంబ రైల్వేస్టేషన్లో రైలు ఆపేలా వినతిపత్రం అందజేత, క్రీడా మైదానం ఏర్పాటు, మహిళల ఉపాధి కోసం నిరంతర శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కోసం చేయాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్టీలు, కులమతాలకు అతీతంగా నిరంతరం శ్రమిస్తున్న అభివృద్ధి కమిటీ అలంపూర్ పురోగతికి సంబంధించి కీలక అంశాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. సమావేశంలో గౌరవ సలహాదారు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్, కార్యదర్శి రజనీబాబు, కోశాధికారి ముస్తఫా, మాజీ కౌన్సిలర్ సుష్మ, సభ్యులు హరిబాబు, నాగమల్లయ్య, వెంకట్నారాయణ, సంజీవనాయుడు, శంకర్, పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు.


