గద్వాల క్రైం: మూడు నెలల పసికందు మృతికి పట్టణంలోని సౌమ్య చిల్డ్రన్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శుక్రవారం రాత్రి చిన్నారి తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఘటనపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. శనివారం జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యాకిరణ్మయి సదరు ఆస్పత్రిని సందర్శించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై వైద్యులు, సిబ్బందిని ఆరా తీశారు. నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం విచారణ దశలో ఉందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. విచారణలో వైద్యులు ప్రసూన్నరాణి, రాజు, సిబ్బంది తిరుమల్రెడ్డి, నర్సయ్య ఉన్నారు.


