అలంపూర్: ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ అలంపూర్ నియోజకవర్గ చైర్మన్ రాంమోహన్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నియోజకవర్గ పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లా చుట్టూ కృష్ణా, తుంగభద్ర నదులు పారుతుండగా.. వీటి ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాల్సి ఉందన్నారు. కానీ, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత 30 ఏళ్లుగా ఆర్డీఎస్ నీటి హక్కులను అమలు చేయడంలో పాలకులు విఫలం అవుతున్నారని ఆరోపించారు. తుమ్మిళ్లతో ఓట్లను కొల్లగొట్టి ఆ తర్వాత రైతులను మభ్యపెడుతున్నారన్నారు. జూరాల కుడికాల్వ ద్వారా ఆర్డీఎస్కు లింకు చేసి మానవపాడు మండలంలోని రైతులకు సాగునీరు అందించాల్సి ఉందన్నారు. కానీ, ఆర్డీఎస్ కాల్వలు ఎత్తుగా ఉండటంతో నీళ్లు ఎలా పారుతాయని ప్రశ్నించారు. కాల్వలు ధ్వంసం కావడంతో వాటిని దున్ని సేద్యం చేసుకోవాల్సిన పరిస్థితికి తెచ్చారని వాపోయారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న మహబూబ్నగర్లో ఉమ్మడి జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


