గద్వాలన్యూటౌన్: ప్రస్తుత సాంకేతిక విద్యను యథావిధిగా కొనసాగించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేశ్ పటేల్ డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యను పరిరక్షించాలని.. జీఓ నం. 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాల్టెక్నిక్ కళాశాలలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుత సాంకేతిక విద్యను కొనసాగిస్తూ, పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యావ్యవస్థ అన్నారు. అలాంటి సాంకేతిక విద్యను ప్రైవేటు సంస్థల్లో విలీనం చేసి, ఇంజినీర్ కావాలనే వారి కలల్ని దూరం చేయడమే అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టె ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికీ పాలిటెక్నిక్ కళాశాలలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, విలీనం చేయడం కాకుండా, మరింత బలోపేతం చేయాలన్నారు. మౌలిక వసుతులు, ఆధునిక కోర్సులు, సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ప్లేస్మెంట్స్ కల్పించాల్సింది పోయి.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ పేరుతో ‘శక్తి’ విభాగంలో చేర్చి ఉన్నత విద్యకు లక్షల మంది విద్యార్థులను దూరం చేసి నిధులను దారి మళ్లించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. జీఓం నం.97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసి సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నితిన్, నరేంద్ర, సురేష్నాయుడు, మంజునాథ్, సాయి హర్ష, శ్రావణి, శ్రీలత, అనుశ్రీ, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.


