● రాజోళి చేనేత కార్మికుల్లో మొక్కవోని ధైర్యం
● వరదలతో మగ్గాలు మునిగినా వృత్తిని వదలని వైనం
రాజోళి: 2009లో వచ్చిన వరదలతో జిల్లాలోని చేనేత కార్మికులు సర్వం కోల్పోయారు. తాము నివసించే ఇళ్లతో పాటు, జీవనం సాగించే మగ్గాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో ఎక్కువగా నష్టపోయింది రాజోళిలోని చేనేత కార్మికులే. వరదల సమయంలో 800 కుటుంబాలు చేనేత వృతిపై ఆధారపడి జీవించగా.. 2,500 మంది కార్మికులు వృత్తిలో ఉన్నారు. వరదలతో అపారనష్టం వాటిల్లినప్పటికీ చేనేత కార్మికులు మొక్కవోని ధైర్యంతో తమ వృత్తిని సాగిస్తున్నారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ ప్రకారం 1,000 కుటుంబాలు చేనేత వృత్తిలో ఉండగా.. దాదాపు 3వేల మందికి పైగా కార్మికులు వృత్తిలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ప్రతి వానాకాలంలో కార్మికుల ఇళ్లలోకి నీరు చేరి.. మగ్గం గుంతలు నీటితో నిండిపోతున్నాయి. రూ.వేలు వెచ్చించి తెచ్చుకున్న ముడిసరుకు తడిసిపోయి పనికి రాకుండా పోతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు సక్రమంగా అందని వారు సైతం ఉన్నారు. అయినప్పటికీ తమ వృత్తికి దూరం కాకుండా.. కష్ట, నష్టాలను తట్టుకుని ముందుకు సాగుతున్నారు.


