అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షకుల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్)మాస్లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సీహెచ్ రాంచందర్ అన్నారు. అమరచింతలోని మార్క్స్ భవనంలో బుధవారం నిర్వహించిన మాస్లైన్ ఉమ్మడి జిల్లా శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నా పాలకులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటంతో నల్ల చట్టాల అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం.. మళ్లీ నల్ల చట్టాలను అమలు చేయాలని చూడటం సరికాదన్నారు. కార్మికులు జీతాల పెంపు కోసం, పనిగంటల కోసం పోరాటాలు చేస్తుంటే.. లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పనిగంటలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతో జంజీ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేందుకు మాస్లైన్ కార్యకర్తలు, నాయకులు ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హనుమంతు, వెంకటేశ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


