● మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
జడ్చర్ల: సాగునీరుకు సంబంధించి సీఎం రేవంత్రెడ్డి చర్యల వల్ల మొదటగా పాలమూరు జిల్లానే నష్టపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఒట్టుకు నిజంగా ప్రాణం ఉండి ఉంటే సీఎం రేవంత్ దేవుళ్ల మీద వేసిన ఒట్లకు.. ఒట్లే ఉరి వేసుకునే పరిస్థితి ఉండేదని విమర్శించారు. జడ్చర్లలో సర్, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఒట్ల మీద ఒట్లు వేసి మంచి పాల వంటి మనసు ఉన్న పాలమూరు ప్రజల గౌరవాన్ని సీఎం రేవంత్రెడ్డి దిగజారుస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్ట్లను ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లుగా మార్చి 10 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.30 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చామని, నెట్టెంపాడుకు 1.60 లక్షల ఎకరాలకు, భీమా ప్రాజెక్ట్ ద్వారా 1.75 లక్షల ఎకరాలకు నీరు అందించామని, కోయిల్సాగర్ పూర్తి చేసి సాగు నీరు ఇచ్చామని గుర్తిచేశారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరులో ఒక్క ఎకరానికై నా నీరిచ్చావా అని నిలదీశారు. ఇటీవల జిల్లాకు వచ్చి సీఎం మాట్లాడుతూ తమకు అర్థం కావడానికే రెండేళ్ల సమయం పట్టిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి ఆయా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇంకెన్నాళ్లు పడుతుందని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


