ఏరువాక వచ్చే..
గద్వాల వ్యవసాయం: ఏరు ముందా.. ఏరువాక ముందా.. అని ప్రతి ఏడాది నడిగడ్డ రైతులు ఎదు రుచూడటంతో పాటు ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఏరువాక పౌర్ణమి నాటికి వర్షాలు కురిసి.. ఇక్కడి కృష్ణానది జలకళ సంతరించుకునేది. వర్షాల కు చాలా చోట్ల విత్తనాలు వేసేవారు. అయితే ఈసా రి జూన్ ముగుస్తున్నా.. ఇంతవరకు ఆశించిన స్థాయి లో ఒక్క వాన రాలేదు. కృష్ణానది నీరు లేక వెలవెలబోతోంది. రైతులు దుక్కులు దున్ని వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. ఏరువాక వ చ్చే.. ఏరు రాకపాయే అని ఆవేదన చెందుతున్నారు.
గతేడాది నిరాశే..
గతేడాది వానాకాలం రైతులకు కన్నీరు తెప్పించింది. ప్రారంభంలో వర్షాలు కురవకపోగా.. ఆ తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల నీరు నిలిచి మొక్కల ఎదుగదలపై ప్రభావం పడింది. సెప్టెంబర్లోనూ కురిసిన వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాదాపు అన్ని రకాల పంటలకు తెగుళ్లు, రకరకాల పురుగులు ఆశించాయి. ఎక్కువగా సాగుచేసిన పత్తిపంట దిగుబడులు సగానికి పడిపోయా యి. పత్తి, వరి, వేరుశనగ, కంది ఇలా వానాకాలంలో సాగుచేసిన అన్ని పంటల దిగుబడులు తగ్గి.. రైతులు ఆర్థికంగా నష్టాలపాలయ్యారు. కూరగాయ ల సాగుపై సైతం తీవ్ర ప్రభావం పడింది. ఆయా కూరగాయల తోటలకు కాయలు కాసే దశలో వర్షాలు రావడంతో మొక్కపైనే మురిగిపోయాయి.
ఈసారి సాగని సాగు..
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ ముందే చెప్పింది. తద్వారా రుతుపవనాలు ఆలస్యం కావడంతో పాటు ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని హెచ్చరించింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. ఈ నేపథ్యంలో జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఒకటి, రెండు మోస్తరు వర్షాలు కురిశాయి. జూరాల ఎగువన భారీ వర్షాలు కురిస్తేనే నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల జలాశయానికి వరద చేరుతుంది. ఆ తర్వాతే జూరాల ఆయకట్టుతో పాటు నెట్టెంపాడు ఎత్తిపోతల కింద సాగు ప్రారంభమవుతుంది. అయితే ఈఏడాది ఇప్పటివరకు ఎగువన వర్షాలు రాకపోవడంతో జూరాలకు వరద రాలేదు. ఓవైపు వర్షాలు లేపోవడం.. మరోవైపు జూరాలకు నీరు రాకపోవడంతో జిల్లాలో సాగు ముందుకు సాగడం లేదు.
ఆందోళనలో నడిగడ్డ రైతులు
ఈసారి ఒకటి, రెండు వర్షాలు మాత్రమే..
వరద రాక వెలవెలబోతున్న కృష్ణానది
ముందుకుసాగని వానాకాలం సాగు
విత్తనాలు వేసిన చోట తప్పని అగచాట్లు
జూన్లో సాధారణ వర్షపాతం:
71.2 మి.మీ.
నమోదైన వర్షపాతం: 50.9 మి.మీ.


