జూలై 4న మిడ్జిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

జూలై 4న మిడ్జిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

Jun 29 2026 1:17 AM | Updated on Jun 29 2026 1:17 AM

జడ్చర్ల/మిడ్జిల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేసి, జెడ్పీటీసీగా ఎన్నికై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వచ్చేనెల 4వ తేదీన మిడ్జిల్‌లో పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ స్థలంలో బీఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహంతో పాటు మాజీ డీసీసీబీ చైర్మన్‌ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. సీఎం సభ ఏర్పాట్లును, హెలిప్యాడ్‌ స్థలం, పార్కింగ్‌తో పాటు విగ్రహాల ఏర్పాటు స్థలాలను ఎస్పీజానకి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగసభ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్‌, ఎస్‌ఐ శ్రీనివాసులు ఉన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై

దృష్టి సారించండి

అయిజ: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టిసారించాలని డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి సూచించారు. ఆదివారం అయిజలో పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, ఓటు హక్కు పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పార్టీ బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 18ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని తెలిపారు. సమావేశంలో నాగర్‌ర్నూల్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి సిద్ధేశ్వర, అలంపూర్‌ ఇన్‌చార్జి శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

కోటిలింగేశ్వరస్వామికి లక్ష పుష్పార్చన

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష పుష్పార్చన, బిల్వార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెండోరోజు జరిగిన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పుష్పాలు, బిల్వ దళాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement