తాలు పేరిట.. నిలువు దోపిడీ
అధికారుల తీరుపై విమర్శలు
ఒక బస్తాలో 40.600 కిలోలు..
ఖరీఫ్లో రైస్ మిల్లర్ల అక్రమార్జన రూ.45 కోట్లు
●
నాలుగు క్వింటాళ్ల ధాన్యం ఏమైందని డ్రైవర్ను నిలదీస్తే నాకేమీ తెలియదంటూ రైస్ మిల్లు యజమాని ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేయగా.. వేబ్రిడ్జి తూకం అంతే వచ్చిందని చెప్పి.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేశాడు. కొనుగోలు కేంద్రంలో బస్తాకు కిలోన్నర పైన అదనంగా తూకం వేశారు. ఇప్పుడు మళ్లీ పది బస్తాల కోత పెట్టారు. అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు.
– ఆంజనేయరెడ్డి, శివాజీ,
అప్పంపల్లి గ్రామం, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా
అన్నదాతలను రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ
చేస్తున్నారు. మట్టి, తాలు పేరిట కోతలపై కోతలు పెడుతూ వారి కష్టాన్ని అప్పనంగా సొమ్ము చేసుకుంటున్నారు.
అంగీకరించని రైతులను దారికి తెచ్చుకునే వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలా ఈ వానాకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు కోట్లాది రూపాయలు దండుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ దీని గురించి పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిన
దందాపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు మట్టి, తాలు, తేమ శాతం అన్ని పరిశీలించి.. నిబంధనల ప్రకారం ఉంటేనే తూకం వేస్తున్నారు. లెక్క ప్రకారం బస్తాకు 40 కిలోల ధాన్యం నింపాలి. బస్తా బరువుతో కలిపి 40.600 కిలోలు తూకం వేయాలి. అయితే తాలు, మట్టి, బస్తా బరువు పేరిట ఇందుకు అదనంగా కిలో నుంచి రెండు కిలోల వరకు ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారం ఆయా జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కోలా సాగుతోంది.
రైతులకు ఫోన్లు చేసి మరీ..
కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్కు 3 నుంచి 4 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని వాహనాల్లో మిల్లులకు తరలించగా.. అక్కడ మిల్లర్లు కొందరు మళ్లీ దోపిడీకి తెగబడ్డారు. ఆ వాహనంలో ఏయే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో.. వారికి ఫోన్లు చేస్తున్నారు. తాలు ఎక్కువగా ఉంది.. క్వింటాల్కు కిలో నుంచి రెండు కిలోల కోత తప్పదు.. అలా అయితేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో కోత పెట్టకుండా నేరుగా సెంటర్లలోనే క్వింటాల్కు 4 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఒప్పుకోకుంటే.. అన్లోడ్ చేయకుండా
ఆయా ప్రాంతాల్లో అనధికారికంగా క్వింటాల్ ధాన్యంలో సుమారు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు తీస్తూ దందాకు తెగబడ్డారు. రైతులు ఒప్పుకుంటేనే ట్రక్షీట్లు తిరిగి ఇస్తున్నారు. ట్రక్ షీట్లు తిరిగి ఇస్తేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసే అవకాశం ఉండగా.. దీన్ని ఆసరాగా చేసుకుని కోతకు అంగీకరించని రైతుల ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా తిరిగి సెంటర్లకు పంపిస్తున్నారు. ఇలా ఇబ్బందులకు గురిచేయడం ద్వారా వారికి విధి లేని పరిస్థితులు కల్పిస్తూ.. దారిలోకి తెచ్చుకుంటున్నారు.
కిలోకు రూ.24
చొప్పున నష్టం..
వానాకాలం సీజన్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 1,049 ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 13,24,145 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 6,16,398 మె.ట., కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,389 పలుకుతోంది. క్వింటాల్కు 3 కిలోల చొప్పున కోత పెడితే రైతుకు రూ.72 నష్టం వాటిల్లుతోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 61,63,980 క్వింటాళ్ల ధాన్యానికి రూ.44.38 కోట్లు నష్టపోయారు. తక్కువలో తక్కువ 3 కిలోలు తీసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. సగటున 4 కిలోలు వేసుకున్నా.. మిల్లర్లు తాలు పేరిట దోచుకున్న ధాన్యం విలువ రూ.60 కోట్లు ఉంటుందని రైతు సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్ల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో)..
జిల్లా కేంద్రాలు కొనుగోళ్ల లక్ష్యం కొన్నది
మహబూబ్నగర్ 195 2,00,000 1,25,219
నాగర్కర్నూల్ 236 2,57,145 71,779
జోగుళాంబ గద్వాల 87 1,25,000 83,933
నారాయణపేట 117 3,12,000 1,29,467
వనపర్తి 414 4,30,000 2,06,000
తాలు పేరిట దోపిడీకి సంబంధించి ఇటు సెంటర్లు, అటు మిల్లుల నిర్వాహకులు కుమ్మకై ్కనట్లు తెలుస్తోంది. లేకుంటే తమకేం మిగులుతుందని పలు సెంటర్ల నిర్వాహకులు రైతులతో బాహాటంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ కోత పెట్టడంపై పలువురు మార్కెటింగ్ అధికారులను ప్రశ్నిస్తే.. తాలు ఉంటే ఏంచేస్తారని మిల్లర్లను వెనుకేసుకురావడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల కష్టాన్ని దోచుకుంటుంటే.. అధికారులు చూస్తూ మిన్నంకుండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్వింటాల్కు 3 కిలోల కోత
వేసుకుంటేనే ఈ విలువ
ఒక్కో చోట 4, 5 కేజీల వరకు తరుగు
తొలుత సెంటర్లలో.. ఆ తర్వాత మళ్లీ మిల్లుల్లో..
అంగీకరించకుంటే ధాన్యం లారీ వెనక్కే..
మిల్లుల నిర్వాహకులకే అధికారుల వత్తాసు
ట్రక్షీట్ చూపిస్తూ ఆందోళన చేస్తున్న ఈ రైతులు నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందినవారు. గతేడాది నవంబర్ 25న ఈ గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో తూకం చేశారు. మొత్తం 796 ధాన్యం బస్తాలకు 318.40 క్వింటాళ్లుగా లెక్క తేలింది. ధన్వాడ సొసైటీ నుంచి లారీ రాగా లోడ్ చేశారు. సొసైటీ కార్యదర్శి వెంకట్రాములు లోడ్ చేసిన లారీని నారాయణపేట మండలం కొల్లంపల్లి మిల్లుకు తీసుకెళ్లాలని డ్రైవర్కు ట్రక్షీట్ రాసిచ్చాడు. లారీ డ్రైవర్ ఒప్పుకోకుండా కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు రాయించుకుని తీసుకెళ్లాడు. అక్కడ అన్లోడ్ అయిన తర్వాత లారీ డ్రైవర్ 29న తిరిగి వచ్చి ట్రక్షీట్ రైతులకు ఇచ్చాడు. దాన్ని చూసి వారు కంగుతిన్నారు. 796 బస్తాలకు 786 బస్తాలు వచ్చినట్లు ఉంది. పది బస్తాలు.. సుమారు 4 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపడంతో రైతులు ఆందోళనకు దిగారు.
తాలు పేరిట.. నిలువు దోపిడీ
తాలు పేరిట.. నిలువు దోపిడీ


