
కేఎల్ఐ.. రికార్డు బ్రేక్!
ఈ ఏడాది ఇప్పటికే 4 టీఎంసీలు పంపింగ్
● గత సీజన్లో 50 టీఎంసీల
నీటి ఎత్తిపోతలు
● మూడు మోటార్లతోనే
కొనసాగుతున్న లిఫ్టింగ్
● భారం పడుతున్నా.. తప్పడం
లేదంటున్న అధికారులు
కొల్లాపూర్: జిల్లా వరప్రదాయిని కేఎల్ఐ ప్రాజెక్టు నీటి ఎత్తిపోతల్లో రికార్డు సృష్టిస్తోంది. కృష్ణానదికి వరద ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే 4 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గత రికార్డుకు బ్రేక్ వేసింది. 2011లో కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ప్రారంభం కాగా.. నాటి నుంచి అవిశ్రాంతంగా మోటార్లు పనిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ప్రాజెక్టు మొదటి పంపుహౌజ్లో రెండు మోటార్లు పాడయ్యాయి. మిగిలిన మూడు మోటార్లతోనే నీటిని ఎత్తిపోస్తూ ప్రాజెక్టు అధికారులు రికార్డు సృష్టిస్తున్నారు.
పనితీరు ఇలా..
కేఎల్ఐ పరిధిలో ఎల్లూరు, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు పంప్హౌజ్లు ఉన్నాయి. ఒక్కో పంపుహౌజ్లో 5 మోటార్ల చొప్పున ఏర్పాటుచేశారు. వీటిలో 4 మోటార్లు రెగ్యులర్ పంపింగ్ కోసం, ఒక మోటార్ స్పేర్లో ఉంచేందుకు నిర్ణయించారు. 30 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటార్ ద్వారా రోజూ 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. కేఎల్ఐ ద్వారా కొల్లాపూర్, నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది.
మోటార్లపై భారం..
ఎల్లూరు పంప్హౌజ్లో ఐదు మోటార్లకు గాను ప్రస్తుతం మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 2011లో కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంమైన సమయంలో ఐదు మోటార్ల ద్వారా 0.0086 టీఎంసీ నీటిని మాత్రమే ఎత్తిపోశారు. 2015 వరకు ప్రతి సంవత్సరం 2.5 టీఎంసీల లోపు మాత్రమే ఎత్తిపోతలు జరిగాయి.మూడు మోటార్ల తోనే రికార్డుస్థాయిలో పంపింగ్ జరుగుతోంది. సాగు, తాగునీటికి కేఎల్ఐ ప్రాజెక్టే దిక్కవడంతో మోటార్లపై పంపింగ్ భారం పెరుగుతోంది. నీటి పంపింగ్ రికార్డుస్థాయిలో జరుగుతోందని ఓవైపు ఆనందపడుతున్న అధికారులు.. మరో వైపు మోటార్లపై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథకు సైతం..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకానికి కూడా కేఎల్ఐ ద్వారానే నీటి ఎత్తిపోతలు సాగుతున్నాయి. ఎల్లూరు సమీపంలోనే మిషన్ భగీరథ స్కీం ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ కోసం 7 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు.
రెగ్యులర్గా పంపింగ్..
వర్షాకాలంలో మినహాయిస్తే మిగతా రోజుల్లో ఎల్లూరు పంప్హౌజ్ లోని మూడు మోటార్ల ద్వారా రెగ్యులర్గా నీటిని పంపింగ్ చేస్తు న్నాం. సాగునీటితో పాటు, మిషన్ భగీరథకు కూడా నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో మోటార్లపై భారం పడుతోంది. అయినా తప్పడం లేదు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపో తలు ప్రారంభమైతే కేఎల్ఐపై భారం తగ్గు తుంది. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. గతేడాది 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం.
– లోకిలాల్ నాయక్,
డీఈ, పంపుహౌజ్ నిర్వహణ విభాగం