రొయ్యల సాగు ప్రశ్నార్థకం | - | Sakshi
Sakshi News home page

రొయ్యల సాగు ప్రశ్నార్థకం

Aug 8 2025 7:51 AM | Updated on Aug 8 2025 7:55 AM

సమాచారం లేదు

జిల్లాలోని జలాశయాలు రొయ్యల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్నాయి. అయితే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబధించి రొయ్యల సీడ్‌ కోసం టెండర్ల నిర్వహణకు సంబంధించిన సమాచారం మాతో లేదు.

– షకీలా బానో, జిల్లా మత్స్యశాఖ అధికారి

గద్వాల శివారులోని జములమ్మ రిజర్వాయర్‌

గద్వాల వ్యవసాయం: జిల్లాలో గడిచిన ఏడాది రొయ్యల సీడ్‌ను వదలలేదు. ఈ ఏడాది అయినా రొయ్యల సీడ్‌ను వదలుతారా.. అని మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 93 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 7162 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు, జూరాల ప్రాజెక్ట్‌, శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌, ఆరు రిజర్వాయర్లు, 38 నోటిఫైడ్‌ చెరువులతో పాటు చిన్న చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్‌ను వదిలి పెంచుతున్నారు.

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా..

ఏడేళ్ల క్రితం రొయ్యల పెంపకంపై మత్స్యశాఖ దృష్టి పెట్టింది. జిల్లాలోని వాతావరణం, జలాశయాల్లోని నీటి సాంద్రత, అందులో ఉండే లవణాలు తదితర అంశాలపై కొంత సమాచారం తీసుకున్నారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా 2019–20లో జూరాల జలాశయంలో 6లక్షల రొయ్యల సీడ్‌ను వదలగా.. బాగా పెరిగాయి. దీంతో మత్యశాఖ అధికారులు ఏటా రొయ్యల సీడ్‌ను వదిలే సంఖ్యను పెంచుతూ వచ్చారు.

ఈసారైనా వదలుతారా..

రొయ్యలసాగు, ఉత్పత్తిలో భాగంగా రొయ్య సీడ్‌ కోసం ప్రభుత్వం మత్స్యశాఖకు బడ్జెట్‌ కేటాయిస్తుంది. ఈబడ్జెట్‌తో రొయ్యల సీడ్‌కు సంబంధించి మత్స్యశాఖ రాష్ట్ర స్థాయిలో టెండర్లు ఆహ్వానిస్తుంది. టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్‌ ఆయా జిల్లాలకు నిర్ధేశించిన సీడ్‌ సంఖ్య ప్రకారం సప్లై చేస్తాడు. ఒక రొయ్య సీడ్‌ రూ.2 నుంచి రూ. 2.50పైసల వరకు గడిచిన 2023–24 వరకు ఉండింది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రొయ్యల సీడ్‌కై ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించలేదు. దీనివల్ల గడిచిన ఏడాది రొయ్యలను వదలలేదు. ఈఏడాది సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతవరకు రొయ్యల సీడ్‌కు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించలేదు. ఫలితంగా ఈఏడాది సైతం రొయ్యల సీడ్‌ వదిలే విషయం పశ్నార్థకంగా మారింది.

సీడ్‌ కోసం బడ్జెట్‌ కేటాయించని ప్రభుత్వం

ఎదురుచూస్తున్న మత్స్యకారులు

గతేడాది ఆర్థికంగా నష్టపోయిన వైనం

మత్స్యకారులకు నష్టం

రొయ్యలు బొన్‌లెస్‌గా ఉంటాయి. దీంతో వీటికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుంది. గద్వాల ప్రాంతంలో కేజీ రూ.300 నుంచి రూ.400 వరకు ధరలున్నాయి. అయితే రొయ్యల సీడ్‌ వదిలిన ఆరు, ఏడు నెలల తర్వాత రిజర్వాయర్‌ పరిధిలోని మత్స్యపారిశ్రామిక సంఘాల్లోని మత్స్యకారులు వలల ద్వార పట్టుకొని విక్రయిస్తారు. చేపలు, రొయ్యల పెంపకం, విక్రయం ద్వార ఆధారపడి ఇక్కడి మత్స్యకారలు జీవనం సాగిస్తున్నారు. మధ్యరాత్రి రిజర్వాయర్లలోకి వెళ్లి వలలు కట్టి, తిరిగి తెల్లవారుజామున వలలో పడ్డ రొయ్యలను తీసి, మార్కెట్‌లో విక్రయించి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తారు. కాగా రొయ్య సీడ్‌ను వదలకపోవడం వల్ల మత్స్యకారులు గడిచిన ఏడాది ఆర్థికంగా నష్టపోయారు. ఐదేళ్ల రొయ్యల ఉత్పత్తిని బట్టి గడిచిన ఏడాది 286 టన్నుల ఉత్పత్తి నష్టపోయారు. ఈ ఏడాది సైతం వదలకపోతే మరోసారి మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడనుంది.

రొయ్యల సాగు ప్రశ్నార్థకం 1
1/1

రొయ్యల సాగు ప్రశ్నార్థకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement