
బాధితులకు అండగా ఉండాలి
గద్వాల క్రైం: జిల్లాలో పోక్సో కేసుల నమోదు, బాధితులకు అందిస్తున్న సేవలపై శనివారం సాయంత్రం గద్వాల జిల్లా అదనపు సెషన్ కోర్టు, పోక్సో కోర్టు జడ్జి ఎస్ రవికుమార్ భరోసా సెంటర్ను తనిఖీ చేసి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భరోసా సిబ్బంది శిరిష, స్రవంతి పలు విషయాలపై జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. జడ్జి వారితో మాట్లాడుతూ జిల్లాలో లైగింక దాడులకు గురైన మైనర్ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసుకున్న చర్యలపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపపడ్డ బాధితులకు భరోసా ఇవ్వలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో భరోసా సిబ్బంది శ్వేత, కీర్తి, కవిత తదితరులు ఉన్నారు.
రాజ్యాంగ నిర్మాతను
అవమానించిన కాంగ్రెస్
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు సముచిత గౌరవం ఇవ్వకపోగా.. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు త్రీవంగా అవమానించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1952 లోక్సభ ఎన్నికల్లో అంబేడ్కర్ను ఓడించేందుకు ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నారాయణరావ్ కథరోల్కర్ను పోటీకి నిలిపియని, నెహ్రూ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేడ్కర్ ఓటమికి కారకులయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో అంబేడ్కర్ స్మృతివనం, పంచతీర్థ పేరుతో ఆయన పుట్టిన స్థలం, నివసించిన స్థలం, దహన సంస్కారాలు నిర్వహించిన స్థలాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్రెడ్డి, రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి పాల్గొన్నారు.
డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (ఎస్డీడీజీడబ్ల్యూటీటీఐ) హైదరాబాద్లో మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళాశిశు సంక్షేమ జిల్లా అధికారిణి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మే 19లోపు దరఖాస్తూ చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, ఇతర నిరాశ్రయులైన పిల్లలు, చిల్డ్రన్ హోం, మహిళా సంస్థల్లోని బాలబాలికలు, దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. వివరాలకు జిల్లా బాలల సంరక్షణ విభాగం గద్వాలలో సంప్రదించాలని కోరారు.
బాల పురస్కార్ అవార్డుకు..
గద్వాల: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ అవార్డుల కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ అధికారిణి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంస్కృతిక కళలు, సాహసం, క్రీడలు,సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలు జూలై 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బాధితులకు అండగా ఉండాలి