భూపాలపల్లి అర్బన్: ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక అధికారి, డీపీఆర్వో, డీఈఓ, ఇంటర్మీడియట్, డీపీఓ, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, జిల్లా సైన్స్ అధికారి సభ్యులుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 15న మండల స్థాయి పోటీలు నిర్వహించగా, 22న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వం, నాటిక, చిత్రలేఖనం వంటి తదితర అంశాల్లో పోటీలు ఉంటా యని చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమాలను నోడల్ అధికారి పర్యవేక్షణలో సంబంధిత కమిటీ సభ్యులు సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి రఘు, డీపీఆర్వో శ్రీనివాస్, డీఈఓ లలిత, ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న, డీపీఓ శ్రీలత, జిల్లా సైన్స్ అధికారి స్వామి, తదితరులు పాల్గొన్నారు.


