ఇక తిరోగమనమే..
జిల్లా ప్రజలపై పడే భారం(అంచనా)..
యూపీఐ పేమెంట్స్పై చార్జీల భారం
భూపాలపల్లి: జేబిలో చిల్లిగవ్వ లేకపోయినా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. సెకన్లలో లావాదేవీలు జరిగిపోయేవి. అయితే అక్టోబర్ 15వ తేదీ నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానున్న డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)తో వ్యాపారులతోపాటు సామాన్యులపై సైతం భారం పడనుంది.
కేంద్రం తీసుకొస్తున్న ఎండీఆర్తో చిరు, పెద్ద వ్యాపారులపై తీవ్ర భారం పడనుండగా సామాన్యులు కొన్ని రంగాల్లో పేమెంట్ల విషయంలో ఇబ్బంది ఎదుర్కోనున్నారు. విద్యుత్, నీటి బిల్లులు, గ్యాస్, స్కూల్, కాలేజీ ట్యూషన్ ఫీజులు, టెలికాం చార్జీలు, రైలు టికెట్లు, పెట్రోల్, డీజిల్, బీమా ప్రీమియం వంటి విభాగాల్లో యూపీఐ చెల్లింపులకు రూ.5 స్థిర ఎండీఆర్ ఛార్జీలు వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఆయా చార్జీలు సంబంధిత సంస్థల నుంచి వసూలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పరోక్షంగా ప్రజల పైనే భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని కుటుంబాల సంఖ్య సుమారుగా 1,11,383. కుటుంబానికి నలుగురు చొప్పున అంచనావేసినా.. జిల్లా జనాభా 4,16,763 ఉంటుంది. ఇందులో ఒక్కో కుటుంబం నెలకు సుమారుగా రూ.10 వేల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తుంది. విద్యుత్, నీటి, గ్యాస్ తదితర చెల్లింపులు రూ.2 వేల లోపే ఉంటుండగా మిగిలిన చెల్లింపులు 5,56,915 జరిగే అవకాశం ఉంది. వీటిపై కేంద్రం కొత్తగా విధించే ఎండీఆర్ సుమారు రూ.5 చొప్పున వేస్తే అదనంగా రూ.27,84,575 వరకు భారం పడనుంది.
యూపీఐ చెల్లింపు వ్యవస్థ ప్రజల్లోకి బాగా విస్తరించి ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో యూపీఐ వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ విధించటంతో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడునుంది. వ్యాపార వర్గాలు ఈ రుసుముల భారాన్ని వస్తువు ఉత్పత్తుల ధరల పెంపు రూపంలో లేదా ఏదో ఒక విధంగా వినియోగదారుల పైనే మోపే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మరోమారు ఆలోచించి పర్సన్ టు మర్చంట్కు చేసే అన్ని రకాల చెల్లింపులపై ఎండీఆర్ లేకుండా చూడాలని సామాన్యులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యాసంస్థల యజమానులు, ఇతర వ్యాపారులు యూపీఐ చెల్లింపులను అనుమతించకుండా నగదును ప్రోత్సహించే అవకాశం ఉంది. దీంతో యూపీఐ నుంచి మళ్లీ నగదు వైపునకు ప్రజలు మరలే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పడంలో అతిశయోక్తిలేదు.
జిల్లాలోని కుటుంబాలు 1,11,383
జనాభా 4,16,763
నెలవారీ చెల్లింపులు రూ.111.38 కోట్లు
రూ.2వేలు దాటే లావాదేవీలు 5,56,915
వాటిపై పడే ఎండీఆర్
(రూ.5 చొప్పున) రూ.27,84,575
డిజిటల్ నుంచి మళ్లీ క్యాష్ వైపు!
ఎండీఆర్తో సామాన్యుడిపై వేటు
రూ.5 చార్జ్ చేస్తే.. జిల్లా ప్రజలపై నెలకు రూ.28 లక్షల భారం


