భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రీ–ప్రైమరీ పాఠశాలలను కలెక్టర్ రాహుల్శర్మ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులను పరిశీలించారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాహనాలు ఏర్పాటు చేసుకుని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థుల ప్రవేశాలను దాదాపు 50 శాతం పెంచడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్ను పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, వసతులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్లు కావాలనే తమ ఆకాంక్షలను వెల్లడించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రీ–ప్రైమరీ పాఠశాలను పరిశీలించారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం పాఠశాల అవరణలో మొక్క నాటారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్.. విద్యార్థులకు రుచికరంగా, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ లలిత, సర్పంచ్ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
కొంపెల్లి ప్రభుత్వ పాఠశాల తనిఖీ


