● అదనపు కలెక్టర్ అశోక్కుమార్
మొగుళ్లపల్లి: అకినపల్లి గ్రామంలో జరుగుతున్న భూ రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశోక్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అకినపల్లి గ్రామంలో రీ–సర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే జరుగుతున్న తీరును, భూ రికార్డులను పరిశీలించి సర్వే బృందాలకు పలు సూచనలు చేశారు. భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా రీ–సర్వేను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. భూ సరిహద్దులకు సంబంధించి వివాదాలు ఉన్న ప్రాంతాల్లో రైతుల సమక్షంలోనే వివరాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. భూ పరిమితులను కచ్చితంగా నిర్ధారించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రీ–సర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, సర్వే వివరాలు, భూ రికార్డుల నమోదులో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


