భూపాలపల్లి అర్బన్: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నేరాల నియంత్రణలో రాజీలేని విధంగా పనిచేయాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లాలోని పోలీస్స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు గస్తీ, నిఘాను పెంచడంతో పాటు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నేరాలను ఛేదించాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. సీసీటీఎన్ఎస్ కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామస్థాయి పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను న్యాయశాఖ సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, డీఎస్పీలు సంపత్రావు, సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


