భూపాలపల్లి అర్బన్: జిల్లా ప్రధాన ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ వైద్యులను ఆదేశించారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ వివిధ విభాగాలు, ఆస్పత్రి మౌలిక వసతులను పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణలో డంప్ యార్డ్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం, డ్రెయినేజీ, సీసీ రోడ్డు పనులను తనిఖీ చేసి నాణ్యత పాటించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న 140 పడకల సామర్థ్యాన్ని 230 పడకలకు పెంచేందుకు అవసరమైన భవనాలు, వైద్య పరికరాలు, సిబ్బంది తదితర వనరులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదని, ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వసంతకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ ఉదయ్కుమార్, ఎన్పీడీసీఎల్ డీఈ పాపిరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్దివ్య, అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి, ఆర్ఎంఓ డాక్టర్ రాజేశ్, టీజీఎంఐడీసీ అధి కారులు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
భూపాలపల్లి: మహిళలు, చిన్నారులు తమ ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. ఈ నెల 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్న 9వ జాతీయ పోషణ్ మాసం కార్యక్రమాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఐడీఓసీ కార్యాలయంలోని తన చాంబర్లో కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ యంత్రాల భద్రతను పరిశీలించారు.
సర్వే, డిజిటలైజేషన్ పూర్తి చేస్తాం..
జిల్లాల్లో మాన్యుస్క్రిప్టస్ (పాండులిపులు) సర్వే, డిజిటైజేషన్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని టూరిజం అండ్ కల్చర్ స్పెషల్ సెక్రటరీ వాణిప్రసాద్ సూచించారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో జ్ఞాన్ భారత్ మిషన్ సర్వే, డిజిటైజేషన్, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాళోజీ జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శం
కలెక్టర్ రాహుల్శర్మ
కాళోజీ జీవితం అందరికీ ఆదర్శం..
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జీవితం ఆయన చూపిన మార్గం ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయమని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ తన కవిత్వం, రచనలు, ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


