● బ్లాక్స్పాట్లను
పరిశీలించిన అధికారులు
భూపాలపల్లి: జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఇచ్చిన సూచనల మేరకు జిల్లాలోని రేగొండ నుంచి మహదేవపూర్ వరకు గుర్తించిన బ్లాక్స్పాట్స్(ప్రమాదకర ప్రాంతాలు)ను నేషనల్ హైవే, రవాణా, పోలీసుశాఖ అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా బ్లాక్స్పాట్లలో ప్రమాదాలకు గల ప్రధాన కారణాలు, రహదారి పరిస్థితులు, మలుపులు, వాహనాల వేగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, రేడియంట్ సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు మలుపుల విస్తరణ, ఇతర ఇంజినీరింగ్ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బ్లాక్ స్పాట్స్ వద్ద అవసరమైన తక్షణ, శాశ్వత నివారణ చర్యలను సమన్వయంతో చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో నేషనల్ హైవే డీఈ సింధూర, సీఐ చెన్నూరి శ్రీనివాస్, డీటీఓ శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


