కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నది వరద మేడిగడ్డ బ్యారేజీకి పోటెత్తింది. బుధవారం ఉదయం 1.51 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ నుంచి తరలిరాగా, సాయంత్రానికి 1.29 లక్షల క్యూసెక్కులకు తగ్గి మేడిగడ్డకు చేరుతోంది. దీంతో బ్యారేజీలో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు అదేస్థాయిలో ఔట్ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 1.44 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో తరలిపోయింది. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పడుతున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు.
నేటి నుంచి గ్రామసభలు
ములుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నేటి నుంచి జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ములుగు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభల్లో అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని వివరించారు. పేరు లేకపోయినా, కొత్త ఓటరు కావాల్సిన వారికి ఫామ్ 6తో దరఖాస్తు చేయాలని, ఫామ్ 7 సవరణలు, ఫామ్ 8 ద్వారా బదిలీ చేపట్టాలని వెల్లడించారు. 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవాలని కోరారు.
రామప్పలో
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయ్యంగార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళకు తలమానికం రామప్ప దేవాలయమని కొనియాడారు. అనంతరం రామప్ప చెరువు సందర్శించి బోటింగ్ చేశారు. వారివెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, టూ రిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దేవాదాయ, పురా వస్తు,టూరిజం శాఖల అధికారులు ఉన్నారు.
విద్యుత్ సమస్యలు
పరిష్కరించాలని వినతి
ములుగు: జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్శాఖ ఏఈకి వినతి పత్రాన్ని కాలనీ వాసులు బుధవారం విద్యుత్శాఖ కార్యాలయం వద్ద బుధవారం అందజేశారు.కృష్ణకాలనీలోని 15వ వార్డులో లోవోల్టేజీ సమస్యతో ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతున్నాయని వార్డు కౌన్సిలర్ వాణికుమార్ ఏఈకి వివరించారు. కార్యక్రమంలో కాలనీవాసులు సంపత్, గండ్రకోట కుమార్, రమేశ్, నాగేశ్వర్రావు, సుధాకర్, శంకర్, కుమార్, సంపత్, ఇక్బాల్ పాల్గొన్నారు.
రాఖీ మహోత్సవం
ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయిపల్లికి చెందిన సంతోష్, రాజేందర్, సమ్మయ్య తదితరుల ఆధ్వర్యంలో బుధవారం రాఖీ మహోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు 1200 మందికి కట్టించి రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించినట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రవీణ్కుమార్ తెలిపారు. పాఠశాలల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు రకాల కార్యక్రమాలను చేపట్టినట్లు ప్రవీణ్ కుమార్ వివరించారు.


