● కలెక్టర్ రాహుల్శర్మ
కాళేశ్వరం: రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు వెదురు సాగు చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందాలని కలెక్టర్ రాహుల్శర్మ సూచించారు. గురువారం మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెంచుతున్న వెదురు మొక్కల నర్సరీని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకం, నిర్వహణ, పంపిణీకి సిద్ధంగా ఉన్న మొక్కల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు సాగు తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాలికంగా లాభాలను అందించే ఆదాయ వనరుగా నిలుస్తుందని తెలిపారు. రైతులు వెదురు సాగును ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా చేపట్టి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో వెదురు మొక్కల పెంపకం కొనసాగుతోందని, సుమారు 70వేల వెదురు మొక్కలు రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 1,200 మంది రైతులను వెదురు సాగు కోసం గుర్తించినట్లు, 15 గుంటల భూమికి ఒక్కో రైతుకు 60 వెదురు మొక్కలను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. వెదురు సాగు చేపట్టిన రైతులకు వీబీజీ రాంజీ పథకం ద్వారా నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వం చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు నర్సరీ నిర్వహణలో మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి బాలకృష్ణ, కాటారం ఆర్డీఓ రవీందర్, ఇండస్ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ తాండ్ర సురేష్, గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్సీ నిర్మాణం పూర్తి చేయాలి
పలిమెల: మండల కేంద్రంలో చేపట్టినన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. పలిమెల మండలంలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంస్థలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. పర్యటనలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవీందర్, డీఆర్డీఓ బాలకృష్ణ, డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదనన్ పాల్గొన్నారు.


