ములుగు: ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైందని, ఓటర్ల చేర్పులు, మార్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల ఆశోక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు గమనించాలని సూచించారు. గణన ఫారాలు, దరఖాస్తుల నింపే విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు కూడా సరైన సమాచారం అందిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రతీ అర్హుడికి ఓటు హక్కు ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, పార్టీ నాయకులు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క


